మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

మచిలీపట్నం-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం అర్ధరాత్రి కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లి వద్దకు రాగానే రైలు ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్‌ స్టేషన్ వద్ద రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందించాడు.

విషయం తెలుసుకున్న ఉంగుటూరు పోలీసులు దగ్గరలో ఉన్న వాటర్ ట్యాంక్ సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో గన్నవరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో అందులో ప్ర‌యాణికుల‌కు పెద్ద ప్ర‌మాదం త‌ప్పిన‌ట్ల‌యింది. లేక‌పోతే పెద్ద సంఖ్య‌లో ప్రాణ న‌ష్టం సంభ‌వించేది.