ఆందోళ‌న‌లు c/o ఓయూ..!

ఉస్మానియా యూనివ‌ర్శిటీలో ఆందోళ‌నలు రోజురోజుకు పెరుగుతున్నాయి. విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌తో ఓయూ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఒక వైపు మ‌ర‌ణించిన విద్యార్థికి న్యాయం చేయాలంటూ విద్యార్థుల ఆందోళ‌న కొన‌సాగుతుండ‌గానే, మ‌రోవైపు ఉప్ప‌ల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ ఉద్యోగులను రెగ్యుల‌రైజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ 24గంట ధ‌ర్నాకు దిగారు.

గత 20 రోజులుగా ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల అద్వర్యంలో ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరవధిక ధర్నా చేస్తున్న ప్రభుత్వం స్పందించ‌డంలేదు. దీంతో ఉప్ప‌ల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ రంగంలోకి దిగి ధ‌ర్నాకు మ‌ద్ద‌తు తెలిపారు. ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వ‌ద్ద 24 గంటల ధర్నా నిర్వ‌హిస్తున్నారు.

ఇతర శాఖల లో రెగ్యులరైజ్ చేస్తున్న‌ప్పుడు, ఓయూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ఎమ్మెల్యే ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు. గత 20 రోజులు గా నాన్ టీచింగ్ ఉద్యోగులు ధర్నా చేస్తున్న ఓయూ అధికారులు,రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చ లు జరపకుండా వారిని అవమాన పరుస్తున్నారని విమ‌ర్శించారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అని చెప్పినా ఔట్ సోర్సింగ్ ,కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల వివక్ష ఎందుక‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మొత్తంమీద అటు విద్యార్థులు, నిరుద్యోగుల‌తో పాటు ఇటు ఉద్యోగులు కూడా ఆందోళ‌న బాట ప‌ట్ట‌డంతో ఓయూ ఆందోళ‌న‌ల‌కు కేరాఫ్ గా మారింది..