చరణ్-శర్వానంద్’ల మల్టీస్టారర్ రాబోతుందా ?

టాలీవుడ్’లో మల్టీస్టారర్ సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. ఇప్పటికే రాజమౌళి రామ్ చరణ్ – ఎన్టీఆర్’లతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఇదీగాక, నాగ్-నాని, నితిన్-శర్వానంద్, బాలయ్య-మహేష్ బాబు, నితిన్-నారా రోహిత్-రానాల కలయికలో మల్టీస్టారర్ సినిమాలు రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ లిస్టులో మరో మల్టీస్టారర్ చేరిపోయింది. రామ్ చరణ్-శర్వానంద్ లు తెరని పంచుకోబోతున్నారంట.

ఈ యేడాది “అర్జున్ రెడ్డి” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దర్శకుడు సందీప్ వంగా. ‘అర్జున్ రెడ్డి’ విమర్శకుల ప్రశంసలు అందుకొంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ‘అర్జున్ రెడ్డి’ని ప్రశంసించారు. ఈ లిస్టులో రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఐతే, ఇప్పుడు రామ్ చరణ్ కోసం సందీప్ వంగా ఓ కథని రెడీ చేసినట్టు సమాచారమ్. ఈ కథలో మరో హీరోకి కూడా అవకాశం ఉంది. ఆ పాత్రలో శర్వానంద్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. చరణ్-శర్వా క్లాస్ మేట్స్ అన్న సంగతి తెలిసిందే. సో.. చరణ్ సినిమా కోసం శర్వా కచ్చితంగా ఓకే చెప్పే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ ‘రంగస్థలం’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చరణ్-శర్వాల మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్లే చాన్స్ ఉన్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.