మహేష్’తో కోల్డ్ వార్’పై స్పందించిన చరణ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ యుద్ధం దాదాపు ముగిసింది. రంగస్థలం, భరత్ అను నేను సినిమాలు బాక్సాఫీస్ వద్ద యుద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో మహేష్, చరణ్ ఇద్దరూ గెలుపొందారు. రంగస్థలం, భరత్ అను నేను బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ క్రమంలో మహేష్, చరణ్ అభిమానుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే ప్రచారం మొదలైంది. మహేష్ సినిమాకు పోటీగా చరణ్ తన సినిమాలని రిలీజ్ చేస్తుంటాడనే కామెంట్స్ వినిపించాయ్.

ఈ ప్రచారంపై ఇటీవల ఓ జాతీయ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ స్పందించారు. మహేష్, తాను మంచి స్నేహితులం. తమ మధ్య ఎలాంటి పోటీ లేదు. ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందంటూ తాము లెక్కలేసును. మహేష్ ‘భరత్ అను నేను’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తనకి సంతోషినిచ్చిందని చెప్పుకొచ్చాడు. మరీ.. ఇప్పటికైనా మహేష్ – చరణ్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ కు తెరపడుతుందేమో చూడాలి.

ప్రస్తుతం మహేష్ వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది మహేష్ 25వ సినిమా కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. మరోవైపు, రామ్ చరణ్ బోయపాటి సినిమాతో బిజీ అయిపోయాడు. ఈ సినిమాలో చరణ్ సరసన కైరా అద్వానీ జతకట్టనుంది. ఈ రెండు సినిమాలు కూడా కాస్త అటు ఇటుగా ఒకేసారి విడుదల కావొచ్చు. మళ్లీ అప్పుడు కూడా మహేష్-చరణ్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ తెరపైకి వస్తుందేమో.. !!!