భాగ్య‌న‌గ‌ర టీఎన్జీవో- ఏపీఎన్జీవో ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌..!!

భాగ్యనగర టీఎన్జీఓ, ఏపీ ఎన్జీఓ ల మధ్య ఘర్షణ జ‌రిగింది. హైద‌రాబాద్ గ‌న్ ఫౌండ్రీలోని ఏపీఎన్జీవో భ‌వ‌న్ వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.రాష్ట్ర విభజన వరకు ఏపీఎన్జీవోలోపని చేసిన భాగ్యనగర టి ఎన్జీవో నేతలు విభజన అనంత‌రం ఏపీఎన్జీవో నుంచి విడిపోయి భాగ్యనగర టీఎన్జీవో ఏర్పాటు చేసుకున్నారు. ఏపీఎన్జీవో లోని నేతలు, ఉద్యోగులు ఏపీకి వెళ్లినందున హైద్రాబాద్ లోని ఆస్తులు తమకే కేటాయించాలని భాగ్యనగర టీఎన్జీవో ప్రతినిధులు కోరుతున్నారు.

గచ్చిబౌలి లో ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లు, గన్ ఫౌండ్రి లోని ఏపీఎన్జీవో భవన్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్ప‌టికే కోర్టును కూడా ఆశ్రయించారు భాగ్య‌న‌గ‌ర టీఎన్జీవోలు. గన్ ఫౌండ్రి కార్యాలయంలో భాగ్యనగర టీఎన్జీవోలకు ఆఫీస్ కోసం గదులు కేటాయించాలని కోర్టు సూచించింది. ఇదే విష‌యంపై గ‌త కొంత‌కాలంగా రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రుగుతోంది.

ఆదివారం ఏపీఎన్జీవో నేత‌లు గన్ ఫౌండ్రి కార్యాలయానికి రావ‌డంతో భాగ్య‌న‌గ‌ర టీఎన్జీవో నాయ‌కులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జ‌రిగాయి. ఏపీఎన్జీవో నేత‌ల‌పై భాగ్య‌న‌గ‌ర టీఎన్జీవో న‌తేలు దాడికి దిగారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది.