‘శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’గా ఖైర‌తాబాద్ గ‌ణేషుడు !!

అత్యంత ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్‌ మహా గణపతి ఈసారి ‘శ్రీ సప్త ముఖ కాళసర్ప మహా గణపతి’ రూపంలో కొలువుదీరనున్నాడు. ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఖైరతాబాద్‌ ఉత్సవ కమిటీ విడుద‌ల చేసింది. ఈ విగ్రహంలో ప్రతిదీ ఏడు వచ్చేలా ఏర్పాటు చేయడం వల్ల ఉత్సవాలు చేసే వారికి, మొక్కే భక్తులకు మేలు జరుగుతుందని సిద్ధాంతి గౌరీభట్ల విఠల్‌ శర్మ సూచనల మేరకు ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

‘శ్రీ సప్త ముఖ కాళసర్ప మహాగణపతి’ విగ్రహం ఎత్తు 57 అడుగులు, వెడల్పు 24 అడుగులు ఉంటుంది. 60 అడుగుల తర్వాత ఏటా ఒక అడుగు తగ్గించాలనే నిర్ణయం ప్రకారం గత ఏడాదే 57 అడుగులుగా ఉండాల్సి ఉన్నా, శిల్పి షష్టి పూర్తి నేపథ్యంలో విగ్రహాన్ని 60 అడుగులుగా చేశారు. దీంతో గత ఏడాదికి బ‌దులు ఈసారి 57అడుగుల వినాయక విగ్ర‌హం రూపుదిద్దుకోనుంది. ఏడు తలలు, 14 చేతులతో తలపై ఏడు సర్పాలతో, పక్కనే ఏడు ఏనుగులు నమస్కరించే రూపంలో ఖైర‌తాబాద్ గ‌ణేషుడు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. గణపతి మండపంలోనే కుడివైపున లక్ష్మీ, ఎడమ వైపున సరస్వతి విగ్రహాలు 14 అడుగుల ఎత్తున ఏర్పాటుకానున్నాయి.

వినాయ‌కుడి 14చేతుల్లో ఒక్కో చేతికి ఒక్కో ప్ర‌త్యేకత ఉండేలా అలంకరణ చేయనున్నారు. కుడివైపు గల ఏడు చేతుల్లో పైనుంచి కిందకు వరుసగా.. అంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గద, ఆశీర్వాదం రూపంలో ఉంటాయి. ఆలాగే ఎడమ వైపు ఏడు చేతుల్లో పాశం, శంకు, కమలం, ఢమరుకం, విల్లు, గడియం, లడ్డు ఉంటాయి.

కుడి, ఎడమ మండపాల్లో.. శ్రీనివాస కళ్యాణం చేయనున్నారు. ఈ ఏడాది వెంకటేశ్వరుడి కళ్యాణ సంవత్సరం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఉత్స‌వ క‌మిటీ. శ్రీనివాస కళ్యాణంలో లక్ష్మీ, విష్ణు, శివపార్వతి, బ్రహ్మ సరస్వతి, నారదుడు, కుబేరుడు, గరుత్మంతుడు ఉంటారు. ఆలాగే ఎడమ మండపంలో నందిపై శివ పార్వతి కుమారస్వామి లింగాన్ని వినాయకుడు పూజిస్తున్నట్లు, శివుడి తలపై గంగ ఉన్నట్లు రూపుదిద్దుకోనుంది.