మహేష్ మొదలెట్టాడు

సూపర్ స్టార్ మహేష్ పని మొదలెట్టాడు. ‘భరత్ అను నేను’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ కాస్త రిలాక్స్ అయినట్టు కనిపించింది. భరత్.. విజయాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు. దీనికి తోడు పిల్లలకు వేసవి సెలవులు రావడంతో ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వెళ్లొచాడు. తిరిగొచ్చాక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన 25వ సినిమాపై ఫోకస్ చేశాడు. ఈ సినిమా కోసం కొత్త లుక్ ని ట్రై చేసే పనిలో పడ్డాడు. చిత్రంలోని పాత్ర లుక్ కోసం స్టయిలిష్ తో చర్చించడానికి ముంబయ్ కూడా వెళ్లొచాడు. ఇప్పుడా పనులన్నీ పూర్తయ్యాయి. సినిమా సెట్స్ మీదకు వెళ్లే టైం వచ్చింది.

మహేష్ 25వ సినిమా తొలి షెడ్యూల్ ఈరోజు (సోమవారం) నుంచి డెహ్రాడూన్ లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత చిత్రబృందం యుఎస్ కి వెళ్లనుంది. అక్కడే 70 శాతంపైగా షూటింగ్ నిర్వహించనున్నారు. యుఎస్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం కావడంతో అధిక భాగం అక్కడే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాలో మహేష్ సరన పూజా హెగ్డే జతకట్టనుంది. కామెడీ హీరో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ముందు నుంచి మహేష్ తన 25వ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెబుతూ వస్తున్నాడు. వంశీ చెప్పిన కథ బాగా నచ్చడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని అశ్వినీదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.