కాంగ్రెస్ న‌ర‌హంత‌క పార్టీ..! ఉత్త‌మ్ ది మేక‌పోతు గాంభీర్యం..!!

కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శల వ‌ర్షం కురిపించారు. కాంగ్రెస్ నేతల మాటలు చూస్తే ఆశ్చర్యమేస్తోందని, అరవై ఏళ్ల దరిద్రం అంటగట్టి… ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారని ఆయ‌న అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీ చెప్పినా ఇంకా కొనసాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ లో పది మంది ముఖ్యమంత్రులంటూఆయ‌న ఎద్దేవా చేశారు.

అవినీతి గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వళ్ళించినట్లుందని, ఆకాశం నుంచి పాతాళం దాకా కాంగ్రెస్ ది కుంభకోణాల చరిత్ర అని విమ‌ర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ ను నరహంతక పార్టీగా ఆయ‌న అభివ‌ర్ణించారు. వందల మంది తెలంగాణ పోరాట యోధుల్ని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీద‌ని చెప్పుకొచ్చారు. కమిషన్లు మోసుడు కాంగ్రెస్ దద్దమ్మలకు తెలుసు కానీ టిఆర్ ఎస్ కు తెలియదన్నారాయ‌న‌.

డిపాజిట్లు కూడా రావనే కాంగ్రెస్ నాయ‌కులు చిల్ల‌ర మ‌ల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు కేటీఆర్. ముందస్తు ఎన్నికలపై ఉత్తమ్ ది మేకపోతు గాంభీర్యమేన‌ని ఆయ‌న అన్నారు. పోచమ్మ గుడికి తీసుకువెళ్లిన మేకపోతు అలానే చేస్తుందని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో త‌మ‌కు, కాంగ్రెస్ కు తెలుసు..ప్రజలకు తెలుసు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు దాటి గెలిచి చూపిస్తామ‌ని ఘంటాపథంగా చెప్పారు మంత్రి కేటీఆర్.