చంద్రబాబును నిద్రలేపడం మా వల్ల కాదు…!!

నిద్రపోతున్న వారిని లేపవచ్చుగానీ, నిద్రపోతున్నట్టు నటిస్తున్న చంద్రబాబు వంటి వారిని లేపడం తమ వల్ల కాదని ఏపీ బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై జ‌రిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని, అవేవీ పట్టనట్టు ప్రభుత్వం నటిస్తోందని ఆమె ఆరోపించారు. మహిళలకు కేంద్రం అందిస్తున్న సంక్షేమాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని విమ‌ర్శించారు. కేంద్రం నిధులను తన నిధులుగా చెప్పుకుంటున్న ఘనత చంద్రబాబుదేన‌న్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం కట్టుబడి ఉందని, ఇనుప ఖనిజం, రహదారులు, మౌలిక వసతులు ఇత‌ర విష‌యాల‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని పదేపదే కేంద్రం అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని ఆమె విమ‌ర్శించారు. మెకాన్ సంస్థతో కూర్చుని చర్చించి, సమగ్ర నివేదికను ఇస్తే క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై ముందడుగు పడుతుందని అన్నారామె.