హైదరాబాద్’లో రాజమౌళి మల్టీస్టారర్ షూటింగ్

‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే సినిమా ఏంటన్నదానిపై కొన్నాళ్లపాటు ఉత్కంఠ నెలకొంది. ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి దిగిన ఓ సింగిల్ ఫోటో ఆ ఉత్కంఠకి తెరదించింది. ఇప్పటికే తారక్-చరణ్’ల మల్టీస్టారర్ స్క్రిప్టు పనులని రాజమౌళి పూర్తి చేశారు. ఇప్పుడీ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేస్తున్నారు. హైదరాబాదు శివారులో లీజుకి తీసుకున్న సువిశాలమైన ప్రాంతంలో భారీ సెట్స్ వేస్తున్నారు. అవి పూర్తికాగానే రెగ్యూలర్ షూటింగ్ కి వెళ్లనున్నారు. ఈ యేడాది నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లాలని అనుకొంటున్నారు. 2020 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారమ్.

ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో తారక్, చరణ్’ల పాత్రలు అద్భుతంగా ఉంటాయని చెబుతున్నారు. సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉండేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకొన్నాడట. ఈ మల్టీస్టారర్ ని బాహుబలి రేంజ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా.. ప్రస్తుతం తారక్ త్రివిక్రమ్ ‘అరవింద సమేత’, రామ్ చరణ్ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ పై ఫోకస్ చేయనున్నారు. మెగా, నందమూరి అభిమానులకు రాజమౌళి ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ గా ఈ మల్టీస్టారర్ ఉండబోతుందని చెప్పుకొంటున్నారు.