చంద్ర‌బాబు క‌ల‌వాల్సిందేనంటున్న రేవంత్..!!

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే ఎన్నిక‌లకు సంబంధించి ప‌లు విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు. తెలంగాణ భ‌విష్య‌త్ రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆయ‌న జోస్యం చెప్పారు. తెలంగాణలో వ‌చ్చే ఎన్నికల్లో విపక్షాలు విజయం సాధించాలంటే పొత్తు అనివార్యమని, కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కలసిపోతేనే కేసీఆర్ ను అడ్డుకోవచ్చని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీకి ఏజెంటులా కేసీఆర్ పని చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు.

బీజేపీని అడ్డుకునేందుకు బీహార్, ఉత్తరప్రదేశ్ లో విపక్షాలు చూపిన ఐక్యతను తెలంగాణలోనూ చూపాల్సిన అవసరం ఉందని అన్నారు రేవంత్. ఎన్నో ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టిన ఎన్టీఆర్, తన పొగరుబోతుతనాన్ని చూపించడంతోనే నాడు ఓడిపోయారని, ఇప్పుడు కేసీఆర్ కూ అదే గతి పట్టనుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. త్వరలోనే చంద్రబాబునాయుడు, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య చర్చలు జరుగుతాయని భావిస్తున్నట్టు ఆయ‌న తెలిపారు.