సూపర్ భామకు బెదిరింపులు

బాలీవుడ్ భామ అయేషా టకియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. పూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున ‘సూపర్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ద్వారానే స్వీటీ అనుష్క తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక, ఈ సినిమా తర్వాత అయేషా మళ్లీ తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్ లో మాత్రం ఒకట్రెండు సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత నటనకు దూరమైంది.

తాజాగా, అయేషా మరోసారి వార్తల్లోకి వచ్చింది. కొంతకాలంగా ఓ వ్యక్తి అయేషాను ఆమె కుటుంబీకులను వేధింపులకు గురిచేస్తున్నాడట. ఆయేషాని చంపేస్తానని బెదిరిస్తున్నాడట. ఈ విషయాన్ని అయేషా భర్త ఫర్హాన్‌ అజ్మీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

‘నా భార్య అయేషాను, మా అమ్మ, సోదరీమణులను ఓ వ్యక్తి కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ విషయం గురించి ఇదివరకే డీసీపీ దాహియాకు ఫిర్యాదు చేశాం. కానీ ఆయన నా ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు పట్టించుకోవడంలేదు. అంతేకాదు మా బ్యాంక్‌ ఖాతాలను దాహియా బ్లాక్‌ చేయించారు. నరేంద్రమోదీజీ, సుష్మా స్వరాజ్‌జీ మాకు సాయం చేయండి. బేటీ బచావో’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

‘మిస్టర్‌ దాహియా. మేల్కోండి. నా ఫోన్లకు స్పందించండి. మాకు సాయం చేయండి’ అంటూ ట్వీట్‌ చేశారు ఫర్హాన్. ఈ సందర్భంగా దాహియాకు చేసిన మెసేజ్‌ల స్క్రీన్‌ షాట్లు కూడా ఫర్హాన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఫర్హాన్‌ వరుసగా ట్వీట్లు చేస్తుండడంతో ముంబయి జాయింట్‌ సీపీ దేవెన్‌ భారతి స్పందించారు. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకు ఫర్హాన్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.