గీతాఆర్ట్స్ బ్యానర్ లో చిరు-పవన్’ల మల్టీస్టారర్

మెగాస్టార్ చిరంజీవి-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ల మల్టీస్టారర్ ని తీసుకొచ్చి తీరుతానని ప్రముఖ పారిశ్రామిక వేత్త, నిర్మాత సుబ్బిరామి రెడ్డి ఒకటికి రెండు సార్లు చెప్పారు. ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు అనే ప్రచారం జరిగింది. సుబ్బిరామి రెడ్డి అంత గట్టిగా చెప్పడంతో.. మెగా-పవర్ మల్టీస్టారర్ పై మెగా అభిమానులు ఆశలు పెట్టుకొన్నారు. ఐతే, ఇన్నాళ్లయినా.. దీనిపై ఎలాంటి అప్ డేటు రావడం లేదు. ఇక, మెగా అభిమానులు ఆశలు వదులుకోవాల్సిందే అనుకొంటున్న సమయంలో మెగా నిర్మాత అల్లు అరవింద్ మళ్లీ ఊరించే ప్రకటన చేశారు.

కరుణాకరణ్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజు-అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘తేజ్ ఐ లవ్ యూ’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడీ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్వీడు పెంచారు. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్ లో గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అరవింద్ చిరు-పవన్ ల మల్టీస్టారర్ ని తీసుకొస్తానని మెగా అభిమానులకి హామీ ఇచ్చారు. అది కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే ఉంటుందని చెప్పారు. మరీ.. అదెప్పుడు ? అన్నది మాత్రం చెప్పలేదు. దీంతో తదుపరి అప్ డేట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూడక తప్పదు.