క‌త్తి మ‌హేష్ వ్యాఖ్య‌ల్ని ఖండించిన‌ జానారెడ్డి..!

కత్తి మహేష్ చానల్స్ లో చేసిన అనుచిత వ్యాఖ్యల‌ను సీఎల్పీ నేత జానారెడ్డి ఖండించారు. ఆయన వ్యాఖ్యలు భావోద్వేగాలు రెచ్చగొట్టడమే కాకుండా ఆందోళ‌న‌ల‌కు తావిచ్చేలా ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. సమాజ సామరస్యానికి భంగం కలిగించేలా మాట్లాడిన కత్తి మహేష్ మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు జానారెడ్డి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోక‌పోతే వర్గ, భావజాల ఘర్షణకు దారితీసే ప్ర‌మాద‌ముంద‌ని ఆయ‌న చెప్పారు.

రేషన్ డీలర్ల సమస్య విషయంలో ప్రభుత్వం దిగివచ్చినందుకు అభినందిస్తున్నాన‌ని ఆయ‌న అన్నారు. రైతు బంధు పథకం ప్రభుత్వం ఎందుకు పెట్టిందో వివరణ ఇవ్వాలని, పథకం లక్ష్యం నెరవేరడం లేదని ఆయ‌న అన్నారు. ప్రభుత్వం వద్ద లెక్కలు లేకపోవటంతో వ్యవసాయం చేసే వారికి నష్టం జరుగుతోందని చెప్పారు జానారెడ్డి. నిజమైన సాగుదార్లకు న్యాయం చేయాలని, ఇందుకు అవసరం అయితే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయ‌న సూచించారు. అవసరం అయితే పట్టాదారుల నుంచి సాగుదార్లకు సాయం అందేలా ప్రభుత్వం చూడాల‌న్నారు.