దొంగ‌ల వేట‌లో సంగారెడ్డి పోలీసులు..!!

సంగారెడ్డి జిల్లా బీరంగూడ‌లో నిన్న రాత్రి చోరీ జ‌రిగింది. గ‌న్ పెట్టి బెదిరించి జ్యూయ‌ల‌రీ షాపులో న‌గ‌లు దోచుకెళ్లిన సంఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టిస్తోంది.. దాదాపు కిలో వ‌ర‌కు బంగారం ఎత్తుకెళ్లారు దుండ‌గులు. బీరంగూడ జ్యూయలరీ షాపులో చోరీ పై పటాన్ చెరు డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు అధికారులు స‌మావేశ‌మై కేసులో ఆధారాల‌ను ప‌రిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగల ఊహా చిత్రాలు గీయిస్తున్నారు.

నిన్న రాత్రి 8.15 గంటలకు తెల్లరంగు స్కూటీ పై జ్యూయలరీ షాప్ నకు వచ్చిన బురఖా వేసుకున్న మహిళ, మరో వ్యక్తి చోరికి పాల్ప‌డిన‌ట్లు సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. 10.14 గంటలకు చోరీ పూర్తి చేసుకుని బయటికి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డుల ఆధారంగా తెలుస్తోంది.. రోడ్డు పై ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ముంబయ్ జాతీయ రహదారి మీదుగా దొంగలు పారిపోయినట్లు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. దుకాణంలో సీసీ పుటేజీ, బీరంగూడ నుంచి సంగారెడ్డి వరకు రోడ్డు పై సీసీ పుటేజీని సేకరించి ప‌రిశీలిస్తున్నారు పోలీసులు.