రాహుల్ పెళ్లిపై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

వివాదాస్ప‌ద కామెంట్స్ చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలిచే టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ పెళ్లి విష‌యంపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు బుధవారం ఒక్కరోజు దీక్ష లో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రాహుల్ ప్రధాని కావాలంటే ఉత్తరప్రదేశ్‌లో బలమైన సామాజిక వర్గం అయిన బ్రాహ్మణుల మద్దతు కావాలని తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు సోనియా గాంధీకి చెప్పానంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. యూపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్ది డిసైడ్ చేయడంలో బ్రాహ్మణ సామాజిక వర్గమే కీలకమ‌ని, అందుకే బ్రాహ్మణ అమ్మాయిల్లో మంచి అమ్మాయిని చూసి రాహుల్‌కి ఇచ్చి పెళ్లి చేయమని సోనియా గాంధీకి సలహా ఇచ్చాన‌ని చెప్పారు జేసీ. కానీ, అప్పుడు ఆమె త‌న‌ మాట వినలేద‌ని ఆయ‌న దీక్ష వేదిక‌లో గ‌తంలో జ‌రిగిన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.