కొండా vs క‌డియం ఫాలోవ‌ర్స్..!!

వ‌రంగ‌ల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో కొండా సురేఖ దంప‌తుల‌కు, పార్టీలో ఒక వ‌ర్గానికి మ‌ధ్య అంత‌ర్గత యుద్దం జ‌రుగుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.. ఈ అంత‌ర్గ‌త యుద్ధం కాస్త ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. తాజాగా వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పోచ‌మ్మ మైదాన్ నుంచి దేశాయి పేట్ వ‌ర‌కు బీటీరోడ్డు శ‌కుస్థాప‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. కొండా దంప‌తులు శంకుస్థాప‌న చేశారు. అయితే శిలాఫలకంపై పేర్ల విషయంలో నేతల మధ్య గొడవ జ‌రిగింది. స్థానిక మేయ‌ర్ కు కొండా దంప‌తుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

త‌మ‌పై విమ‌ర్శ‌లు చేసేవారికి కొండా దంప‌తులు స‌వాల్ విసిరారు. గెలిచిన‌ప్ప‌టి నుంచి ఏ ఒక్క‌రిద‌గ్గ‌రైనా క‌మిష‌న్ తీసుకున్న‌ట్టు రుజువు చేస్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని వేదిక‌పై ప్ర‌క‌టించారు. కొంత మంది శిలాపలకం మీద పెద్దగా పేరు పెట్టలేదని,ఫోటో పెట్టలేదని అలిగారని, రోడ్డు అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నించి కలెక్టర్,మున్సిపల్ కమీషనర్ నుండి ఫోన్ చేయించారని బాహాటంగా విమ‌ర్శించారు. దీంతో ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య వివాదం మ‌రింత ముదిరింది.