ఎన్టీఆర్ నిర్మాతగా మారిన ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్ నిర్మాతగా మారాడు. ఆయనతో బ్లాక్ బస్టర్ సినిమాలని తీయబోతున్నాడు. ఇది నిజమే. ఐతే, ఇదంతా మహానటుడు ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో జరగబోతుంది. క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ‘ఎన్ టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో జీవితంలో ఎన్టీఆర్ ఎదుగుదలకు సహకరించిన వారి పాత్రలని చూపించబోతున్నారు. ఈ జాబితాలో ఎల్వీ ప్రసాద్, నాగి రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎల్వీ ప్రసాద్ పాత్ర కోసం బెంగాలీ నటుడు జిష్షు ని తీసుకొన్నారు. ఇక, నాగిరెడ్డి పాత్రకోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ని తీసుకొన్నారు.

‘విజయ వాహిని స్టూడియోస్’ అధినేతగా, దర్శక నిర్మాతగా నాగిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాపాటవాలు కలిగిన వ్యక్తిగా కనిపిస్తారు. ఆయన సినిమాల్లో కథ,కథనాలు బలంగా ఉంటాయి. ఎన్టీఆర్ హీరోగా ‘విజయ వాహిని స్టూడియోస్’ పలు సినిమాలొచ్చాయ్. నాగిరెడ్డికి ఎన్టీఆర్ అధిక ప్రాధాన్యతనిచ్చేవారు. ఇప్పుడా అనుబంధాన్ని ఎన్ టీఆర్ బయోపిక్ లో చూపించబోతున్నారు. ఆ పాత్ర కోసం ప్రకాష్ ని తీసుకోవడంతో.. సినిమాకి మరింత నిండిదనం వచ్చినట్టయ్యింది.

ఎన్టీఆర్ బయోపిక్ స్టార్స్ తో నిండిపోతుంది. తండ్రి ఎన్టీఆర్ గా బాలకృష్ణ కనిపించబోతున్నారు. ఆయన భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపిస్తారు. ఆనాటి ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు పాత్రలో బాలీవుడ్ నటుడు సచిన్ కేడ్కర్ నటించనున్నారు. వీరేగాక, మోహన్ బాబు, మహేష్ బాబు, రానా, నాగ చైతన్య, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, అనసూయ.. తదితరులు ఎన్ టీఆర్ జీవితకథ లో కనిపించబోతున్నట్టు సమాచారమ్.