ఫిఫా మానియా.. ఫుట్ బాల్ జట్టు జెర్సీలో ప్రధాని, మంత్రులు !

ఫిఫా ఫైట్ ఆఖరి అంకానికి చేరుకొంది. ఆదివారం జరగబోయే ఫైనల్లో క్రొయేషియా- ఫ్రాన్స్‌ తలపడనున్నాయి. ఈ టోర్నిలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రొయేషియా జట్టు అదరగొట్టింది. జర్మనీ, బ్రెజిల్‌ వంటి మేటి జట్లను మట్టికరిపింది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌కు షాకిచ్చి ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్రొయేషియా కప్ గెలవడం సంగతి ప్రక్కన పెడితే.. ఇప్పటికే ఆ దేశ ప్రజల మనసులని గెలిచేసింది. క్రొయేషియా అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.

క్రొయేషియాలోని ఏ వీధిని చూసినా అభిమానులు ఆ దేశ ఫుట్‌బాల్‌ జట్టు ఆటగాళ్లు ధరించే జెర్సీలు ధరించి కనిపిస్తున్నారు. తాజాగా ఆ దేశ ప్రధాని, మంత్రులు కూడా జెర్సీలు ధరించి సందడి చేశారు. గురువారం క్రొయేషియా ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ఆ దేశ ప్రధాని ఆండ్రెజ్‌ ప్లెంకోవిక్‌ కూడా హాజరయ్యారు.

సమావేశానికి వచ్చిన ఆండ్రెజ్‌తో పాటు మంత్రులంతా ఆ దేశ ఫుట్‌బాల్‌ జట్టు ధరించే జెర్సీలను వేసుకుని వచ్చారు. ఫైనల్‌ చేరిన తమ జట్టుకు మద్దతుగా నిలిచారు. ఫిఫా ప్రపంచకప్‌లో ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్‌ చేరిన జట్టు క్రొయేషియా. ఆదివారం జరగబోయే ఫైనల్లో ఫ్రాన్స్‌ ని మట్టికరిపించి.. కప్ ని గెలుచుకుంటుందేమో చూడాలి.