కైరా, కొరటాలకు భరత్.. బాకీ పడ్డాడట !

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అను నేను’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రూ. 90కోట్లకు పైగా షేర్ ని వసూలు చేసింది. అయినా.. ఆ చిత్ర నిర్మాత డివివి దానయ్య దర్శకుడు కొరటాల, హీరోయిన్ కైరా అద్వానీలకు పూర్తి స్థాయి రెమ్యూనరేషన్ చెల్లించలేదట. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికలో కథనంలో పేర్కొంది.

ఐతే, ఈ విషయంపై దర్శకుడు కొరటాల ఎక్కడా నోరు విప్పలేదు. ఆయనది సున్నితమైన మస్థత్వం. గందరగోళం సృష్టించడం ఆయనకు అస్సలు ఇష్టముండదు. అందుకే రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాత దానయ్యని బదనాం చేయలేదు కొరటాల. ఇదీగాక, కొరటాల-దానయ్య కలయికలో మరో సినిమా రావాల్సి ఉంది. ఐతే, దానయ్య తీరుపట్ల అసంతృప్తితో ఉన్న కొరటాల ఆయనకు మరో సినిమా చేసి పెట్టేందుకు ఇష్టపడటం లేదని చెబుతున్నారు.

బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీకి తెలుగులో ఇదే తొలి చిత్రం. తొలి చిత్రంలోనే ఆమెకు పారితోషకం విషయంలో చిక్కులు తప్పడం లేదట. కైరా అద్వానీకి కూడా దానయ్య ఇంకా పూర్తి పారితోషకం ఇవ్వలేదట. ఐతే, ఆమె నటిస్తున్న రెండో సినిమా (రామ్ చరణ్) కి కూడా దానయ్యనే నిర్మాత. దీంతో.. ఈ రెండు సినిమాల పేమెంట్స్ ని ఒకేసారి క్లియర్ చేస్తాడనే ఆశతో కైరా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ మధ్య నిర్మాత డివివి దానయ్య జోరుమీదున్నాడు. వరుసపెట్టి భారీ చిత్రాలని నిర్మిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్, చరణ్ ల మల్టీస్టారర్ కి కూడా దానయ్యనే నిర్మాత. ఈ మల్టీస్టారర్ కోసం భారీ బడ్జెట్ ని ఖర్చు చేయనున్నారు. ఇంకా భరత్.. బ్యాలెన్స్ ని క్లియర్ చేయలేని దానయ్య రాజమౌళి మల్టీస్టారర్ ని ఎలా డీల్ చేయగలరు ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో బండ్ల గణేష్ వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు చేసి.. షెడ్డుకెళ్లారు. మరీ.. దానయ్య పరిస్థితి ఏం అవుతుందో చూడాలి.