బహిష్కరణ నిర్ణయాన్ని సమర్థించుకొన్న కేసీఆర్

రాముడు, రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, ఆయన వ్యాఖ్యలకు నిరసన పాదయాత్రకు రెడీ అయిన స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరిని ఏపీలో వదిలిపెట్టి వచ్చారు. ఈ నిర్ణయం వెనక సీఎం కేసీఆర్ ఉన్నారని, స్వయంగా సీఎం ఇచ్చిన ఆదేశాలతో నగర బహిష్కరణ జరిగిందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీ-బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిజాంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేశారు కూడా.

ఐతే, ఈ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ సమర్థించుకొన్నారు. ఆదివారం కేసీఆర్ గవర్నర్ ని కలిశారు. ఇద్దరిని నగర బహిష్కరణ చేయడానికి గల కారణాలని వివరించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటాం. వాటికి ముప్పుగా పరిణమిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కత్తి, స్వామీజీ బహిష్కరణకు అదే కారణమని వివరణ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు, ముందస్తు ఎన్నికలు.. తదితర అంశాలపై వీరిద్దరు చర్చించుకొన్నట్టు సమాచారమ్.