అవిశ్వాసం చర్చలో మహేష్, ప్రభాస్ కూడా.. !

లోక్ సభలో జరుగుతున్న అవిశ్వాస తీర్మాణంపై చర్చలో టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, ప్రభాస్ లు కనిపించారు. కాదు.. కాదు వినిపించారు. విభజన హామీల అమలుపై విఫలమైన కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మాణం పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి కాంగ్రెస్ తో పాటుగా వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు ప్రకటించాయి. ఫలితంగా అవిశ్వాస తీర్మాణంపై చర్చకు స్వీకర్ అనుమతినిచ్చారు. నేడు లోక్ సభలో జోరుగా చర్చ జరుగుతోంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తొలి ప్రసంగం చేశారు. ఏపీకి కేంద్రం చేసిన మోసాన్ని సభలో ఎండగట్టారు. ఆయన ప్రసంగంలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు బాహుబలి, భరత్ అను నేను సినిమాలు వినిపించడం ఆకట్టుకొంది.

ఆయన ప్రసంగం మొదట్లోనే ‘భరత్ అను నేను’ సినిమా లైన్ ని వినిపించారు. మాట నిల‌బెట్టుకోవ‌డం గురించి ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాలో చూపించారు. ప్ర‌స్తుతం టీడీపీ కూడా మాట నిల‌బెట్టుకోవాల‌నే చెబుతోంద‌న్నారు గల్లా. సూపర్ స్టార్ మహేష్ కు గల్లా జయదేవ్ స్వయానా బావ అన్న సంగతి తెలిసిందే. ఆ ప్రేమతోనే మహేష్ సినిమాని లోక్ సభలో వినిపించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సత్తాచాటిన ‘బాహుబలి’ సినిమా కూడా జయదేవ్ ప్రసంగంలో వినిపించింది. ఏపీకి న్యాయం కోసం చంద్రబాబు బాహుబలిలా పోరాడుతున్నాడని అన్నారు. మొత్తానికి.. లోక్ సభలో మహేష్, ప్రభాస్ సినిమా పేర్లు వినిపించడం.. ఆ స్టార్స్ అభిమానులు ఖుషి అవుతున్నారు.