తేజు లవ్ స్టోరీకి భారీ నష్టాలు

మెగా హీరోలు అంటేనే మాస్’కు పెట్టింది పేరు. ఐతే, రొటీన్ మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో ప్రేక్షకులకు బోర్ కొట్టించాడు మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. తిక్క, విన్నర్, జవాన్, ఇంటిలిజెంట్ సినిమాలు ప్రేక్షకులకు రొటీన్ గా అనిపించాయి. అందుకే వాటిని ప్లాపులుగా తేల్చేశారు. ఈ నేపథ్యంలోనే తేజు కొత్తగా ట్రై చేశాడు. ప్రేమకథల స్పెషలిస్టు కరుణాకరణ్ దర్శకత్వంలో ఓ ప్రేమకథ చేశాడు. ‘తేజ్ ఐ లవ్ యు’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీన్ని రొటీన్ లవ్ స్టోరీగా ప్రేక్షకులు తేల్చేశారు. ఫలితంగా తేజు ఖాతాలో మరో ప్లాపు చేరింది.

ఈ సినిమా ఫస్ట్ షోతోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకొంది. తేజు-అనుపమల మధ్య కెమెస్ట్రీ బాగానే కుదిరినా.. కథ-కథనంలో బలం లేకపోవడం పెద్ద మైనస్ అయ్యింది. ఇప్పుడీ సినిమా లాస్ లెక్కెంత ? అనేది తేలిపోయింది. రూ. 16కోట్లకు తేజు లవ్ స్టోరీ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఐతే, మొత్తంగా ఈ సినిమా రూ. 4.2కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టగలిగింది. ఫలితంగా రూ. 10కోట్లకు పైగానే నష్టాలు తెచ్చిపెట్టింది. తొలి రోజు రూ. 1.98కోట్లు తెచ్చిపెట్టిన తేజు లవ్ స్టోరీ.. నెగటివ్ టాక్ తో కలెక్షన్స్ ఘోరంగా పడిపోయాయి. ఫలితంగా తేజు అట్టర్ ప్లాపుగా మిగిలిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక, ఈ సినిమా తర్వాత కూడా తేజు కొత్తగా ట్రై చేస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా చేయబోతున్నాడు. ఇదో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనుందని చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత కొత్త దర్శకుడు గోపాల్ దర్శకత్వంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ ని చేయబోతున్నాడు. ఈ సినిమాకు `భగవద్గీత సాక్షిగా` అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారమ్.