చిరుని వాడేసుకొంటున్న టీడీపీ

మెగాస్టార్ చిరంజీవిని తెలుగుదేశం పార్టీ వాడేసుకుంటోంది. చిరు 151 సినిమాగా ‘సైరా నర్సింహారెడ్డి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం జెడ్ స్వీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడీ సినిమా క్రేజ్ ని టీడీపీ ఎంపీలు వాడుకొంటున్నారు. ఆ పార్టీ చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ రకరకాల వేషాధారణలతో ఆందోళనకు దిగడం అలవాటే. తాజాగా, ఆయన సైరా నర్సింహారెడ్డి వేషాధారణతో పార్లమెంట్ కు వచ్చారు. పార్లమెంట్ ఆవరణలో మిగితా టీడీపీ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.

‘సైరా… నరసింహారెడ్డి’ అంటూ ప్రధానికి హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే రాష్ట్రానికి ఇస్తామన్న హామీలన్నీ నెరవేర్చాలని లేకుంటే నరసింహారెడ్డి తన కరవాలానికి పని చెబుతాడని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇక, ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ పాత పాటే పాడుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకొన్నారు. ఇప్పటికే 90శాతం నిధులు కూడా ఇచ్చామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.