కార్తీలో జగన్ ని చూపిస్తారట !

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్ర ‘యాత్ర’ పేరిట తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మహి.వి రాఘవ్ దర్శకుడు. మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డిగా చేస్తున్నారు. ఆయన తండ్రి రాజారెడ్డిగా జగపతి బాబు కనిపిస్తారు. 2019 ఎన్నికల టార్గెట్ గా ‘యాత్ర’ తెరకెక్కుతోందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చేందుకు రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర. ఈ క్రమంలో ఆయన జననేతగా మారిపోయిన తీరుని సినిమాలో హైలైట్ చేసి చూపనున్నారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఇదో గిఫ్ట్ గా అందజేయాలని భావిస్తున్నారు.

రాజశేఖర్ రెడ్డి జీవిత ‘యాత్ర’లో ఆయన తనయుడు వైఎస్ జగన్ పాత్ర కూడా కీలకంగా కనిపించనుంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ బిజినెస్ వ్యవహారాలు చూసుకునేవాడు. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు. సినిమాలో జగన్ పాత్రకు సూర్య అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించారని తెలిసింది. ప్రస్తుతం సూర్య హీరోగా, నిర్మాతగా బిజీ. ఈ నేపథ్యంలో జగన్ పాత్రని తాను చేయలేనని చెప్పాడట. ఐతే, ఆ పాత్రకు తన తమ్ముడు కార్తీ ఫర్ ఫెక్ట్ గా సూటవుతాడని చెప్పాడట.

కార్తీకి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. కార్తీలో జగన్ ని చూపించవచ్చు అనే నమ్మకంతో ఆయన్ని తీసుకొనేందుకు చిత్రబృందం రెడీ అయినట్టు తెలిసింది. ఇక జగన్ తో ఉన్న అనుబంధంతో కార్తీ కూడా ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించినల్టుగా తెలుస్తుంది. కార్తీ జగన్ గా మారబోతున్నాడన్న విషయంపై చిత్రబృంద ప్రకటించలేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రావొచ్చని చెబుతున్నారు. ‘యాత్ర’ వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.