సైనా ఎనిమిదోసారి.. !


ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఎనిమిదిసార్లు క్వార్టర్స్‌ చేరిన తొలి క్రీడాకారిణిగా #సైనానెహ్వాల్‌ చరిత్ర సృష్టించింది. ప్రికార్టర్స్‌లో సైనా థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి రచనోక్‌ ఇతనాన్‌ ని ఓడించింది. 36 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో సైనా 21-16, 21-19 మ్యాచ్‌ను గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. దీంతో ఈ టోర్నిలో సైనా వరుసగా 8సార్లు క్వార్టర్స్‌ కు చేరినట్టయింది. ఇదో రికార్డు. క్వార్టర్స్‌లో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో సైనా.. కరోలినా మారిన్‌తో తలపడనుంది.

మరోవైపు, పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ పోరాటం ప్రిక్వార్టర్స్‌తోనే ముగిసింది. డారెన్‌ లివ్‌ (మలేషియా)తో 18-21, 18-21తో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. ఇక,మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్‌-అశ్విని పొన్నప్ప జోడీ ముందంజ వేసింది. 59 నిమిషాల పాటు హోరాహోరీ పోరులో భారత జోడీ 20-22, 21-14, 21-6 తేడాతో సూన్‌ హాట్‌-షివన్‌ జెమిలాయ్‌(మలేషియా)పై గెలుపొంది క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.