శ్రద్దాపై సైనా అసంతృప్తి


బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండు కొనసాగుతోంది. సినిమా, వెబ్ సిరీస్ లు గా ప్రముఖుల జీవిత కథలు తెరకెక్కుతోన్నాయి. భారీ విజయాన్ని అందుకొంటున్నాయి. ఆ విజయాలు మరికొన్ని బయోపిక్ లని తెరకెక్కేందుకు స్పూర్తిగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితకథ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దర్శకుడు అమోల్ గుప్తా సైనా జీవితకథని రెడీ చేసుకొన్నాడు. సైనా నెహ్వాల్ పాత్రకిగాను శ్రద్ధా కపూర్ ను ఎంపిక చేసుకున్నారు. ఐతే, ఈ బయోపిక్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై తాజాగా, సైనా నెహ్వాల్ స్పందించింది.

“ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి ఏడాదికి పైగా అవుతోంది. నా పాత్రను పోషించనున్న శ్రద్ధా కపూర్ బ్యాడ్మింటన్ లో శిక్షణ తీసుకోవలసి వుంది. ఆమె శిక్షణ పూర్తయిన తరువాతనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి ఉంటుంది. కానీ, ఆమె ఈ ప్రాజెక్టుపై దృష్టిపెట్టడం లేదు” అంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది సైనా. మరోవైపు, సైనా బయోపిక్ ని ఒప్పుకొన్నాక.. శ్రద్దాకు అవకాశాలు పెరిగాయి. ఆ కారణంగానే ఆమె శిక్షణ కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రద్దా కపూర్ తెలుగులో ప్రభాస్ ‘సాహో’లో నటిస్తోంది.