‘కిక్ ఛాలెంజ్’కు తెలంగాణ టచ్.. అదిరిపోయింది.. !


హాలీవుడ్ నుండి పుట్టుకొచ్చిన ‘కిక్ ఛాలెంజ్’ టాలీవుడ్ లోనూ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ, రెజీనాలు కిక్ ఛాలెంజ్ చేసి చూపించారు. ఐతే, దేశంలో ‘కిక్ ఛాలెంజ్’ పట్ల తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఇలాంటి పనికిమాలిన ఛాలింజ్ ల కంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘గ్రీన్ ఛాలెంజ్’ చేయడం ఉత్తమం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా, ‘కిక్ ఛాలెంజ్’కు దేశీ టచ్ అద్ది తెలంగాణ యువకులు చేసిన ఛాలెంజ్ అదిరిపోయింది. తెలంగాణలోని లంబడిపల్లి గ్రామానికి చెందిన గీలా అనీల్ కుమార్(24), పిల్లి తిరుపతి(28) వరినాట్ల సందర్భంగా.. ఎద్దులతో పొలాన్ని చదును చేస్తూ డ్రేక్ పాడిన ‘ఇట్స్ మై ఫీలింగ్స్’ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ వేశారు. కొంచెం గంగ్నమ్ స్టైల్, మరికొంచెం దేశీ డ్యాన్స్ మిక్స్ చేసి అదరగొట్టేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకూ 1.6 కోట్ల మంది చూశారు.

ఈ ప్రయత్నం చేసిన యువరైతులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రముఖ కెనడియన్ కమెడియన్, టీవీ వ్యాఖ్యాత ట్రెవార్ నోవా.. కికీ చాలెంజ్ లో ఈ ఇద్దరు యువ రైతులు విజేతలుగా నిలిచినట్లు ప్రకటించాడు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ స్పూర్తితో దేశంలోని మరికొందరు యువ రైతులు పొలంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.