దిల్ రాజు నుంచి శ్రావణ మాసం ఆఫర్


శాంపింగ్ మాల్స్ కస్టమర్స్ ని ఆకట్టుకోవడానికి.. ఆషాడమాసం, శ్రావణమాసం.. అంటూ భారీ ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. ఇప్పుదు నిర్మాత దిల్ రాజు కూడా ప్రేక్షకులకి శ్రావణ మాసం ఆఫర్ ని ప్రకటించేశారు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. సతీష్ వేగ్నేష దర్శకుడు. నితిన్-రాశీఖన్నా జంటగా నటించారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు శ్రావణమాసం ఆఫర్ ని ప్రకటించారు. ఈ శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకోబోతున్న జంటలకు తమ చిత్రబృందం పట్టు వస్త్రాలను బహుమతిగా ఇవ్వనుందని తెలిపారు. అది కూడా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందేలా దేవాలయంలో పూజలు జరిపించి వీటిని అందిస్తామని ప్రకటించారు.

దీనికోసం.. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు చేసుకోబోతున్న జంటలు తమ వెడ్డింగ్ కార్డును పంపాల్సి ఉంటుంది. వీటిలో కొంతమంది ఎంపిక చేసిన జంటలకు తమ ‘శ్రీనివాస కల్యాణం’ టీమ్ స్వయంగా వచ్చి దుస్తులను అందిస్తుందని తెలిపారు. పెళ్లి కార్డుని పంపించాల్సిన అడ్రస్ ని త్వరలోనే సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తామని చెప్పారు.