కరుణానిధి ఆరోగ్యం మళ్లీ విషమం


డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం మరోసారి విషమించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వైద్యులు తెలిపారు. వయోభారం కారణంగా కరుణానిధి అవయవాలను పనిచేయించడం సవాలుగా ఉంది. తర్వాతి 24 గంటల్లో అందించే వైద్యానికి ఆయన శరీరం స్పందించే తీరునుబట్టి ఆరోగ్య పరిస్థితిని నిర్ణయించగలమని ఆ బులెటిన్‌ పేర్కొంది. కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్‌ తొలిసారిగా సోమవారం ఆస్పత్రికి చేరుకోవడం, ఇతర కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరుగా ఆస్పత్రికి వస్తుండటంతో కరుణానిధి ఆరోగ్యం డీఎంకే నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది.

గత నెలలో కరుణ తీవ్ర అస్వస్థతకు గురవడంతో చెన్నై ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆయన్ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు పరామర్శించారు.