రైల్వే స్టేషన్’లో తారక్ యాక్షన్


ఫ్యాక్షన్ సినిమాల్లో రైల్వే స్టేషన్ సీన్ ని సెంటిమెంట్’గా భావిస్తుంటారు. రైల్వే స్టేషన్ లో రౌడీలని గడగడలాడిస్తే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కిందే లెక్క. బాలయ్య నటించిన ఫ్యాక్షన్ సినిమాల్లో ఈ తరహా సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది. సమరసింహారెడ్డి, నర్సింహానాయుడు.. సినిమాల్లో రైల్వే స్టేషన్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. అప్పటి నుంచి బాలయ్య రైల్వే స్టేషన్ నడుచుకొంటూ వస్తే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అని ఆయన అభిమానులు భావిస్తుంటారు.

ఇప్పుడీ సెంటిమెంట్ ని ‘అరవింద సమేత’ కోసం ఎన్టీఆర్ ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం ‘అరవింద సమేత’ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవలే ఓ పురాతన దేవాలయంలో కొన్ని సన్నివేశాలని చిత్రీకరించారు. ఇప్పుడు షూటింగ్ రైల్వే స్టేషన్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ తారక్, పూజా హెగ్డే తదితరులపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం తెలిసిన నందమూరి అభిమానులు రైల్వే స్టేషన్ సెంటిమెంట్ ని గుర్తుకు తెచ్చుకొంటున్నారు. ‘అరవింద సమేత’ బ్లాక్ బస్టర్ హిట్ ని తేల్చేస్తున్నారు.

త్రివిక్రమ్-తారక్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘అరవింద సమేత’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 100కోట్లు దాటేలా జరుగుతోంది. ఇందులో తారక్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. తారక్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. మరో హీరోయిన్ గా ఈష దెబ్బ నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం. రాథాకృష్ణ నిర్మాత. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా టీజర్ ని విడుదల చేయనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమాని విడుదల చేయనున్నారు.