సేల్స్‌బాయ్‌గా సచిన్ తనయుడు

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మరోసారి వార్తల్లోకి నిలిచాడు. లండన్ వీధుల్లో డిజిటల్ రేడియోలు అమ్ముతూ కనిపించాడు. ఈ ఫొటోని టీమీండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. ‘లార్డ్స్ వద్ద రేడియోలు ఎవరు అమ్ముతున్నారో చూడండి.. ఇప్పటికే 50 అమ్మేశాడు. కొన్నే ఉన్నాయి. త్వరపడండి’ అని హర్భజన్ ట్యాగ్‌ చేశాడు.

శ్రీలంకతో అండర్ -19 యూత్ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ముంబై ఆఫ్ సీజన్ క్యాంప్ నకు అర్జున్ ని ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో అర్జున్ ఇంగ్లాండ్ కి వెళ్లాడు. ప్రస్తుతం లార్డ్స్ మైదానంలో ఎంసీసీ యువ ఆటగాళ్లతోపాటు శిక్షణ తీసుకుంటున్నాడు. ఇదే మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు భారత బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేసిన అర్జున్‌. మొదటి రోజు ఆట నిలిచిపోయినప్పుడు గ్రౌండ్ స్టాఫ్‌కి సహాయపడి అందరి దృష్టినీ ఆకర్షించాడు. శనివారం ఏకంగా అర్జున్ సేల్స్‌బాయ్‌గా మారిపోయాడు.

మొత్తానికి ఇంగ్లాండ్ టూర్ లో అర్జున్ రోజుకో ఆకట్టుకొనే పని చేసి వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ తో అర్జున్ లంచ్ డేట్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.