షాక్ : దర్శకురాలు బి. జయ మృతి


టాలీవుడ్ కు మరో షాక్. దర్శకురాలు బి. జయ (54) కన్నుమూశారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన స్వగృహంలో గురువారం రాత్రి 9:30 గంటల కు ఆమె మృతి చెందారు.

పాత్రికేయురాలిగా ప్రస్థానాన్ని ఆరంభించిన జయ.. తర్వాత దర్శకత్వం పట్ల ఆసక్తితో ఆ రంగంవైపు అడుగేశారు. 2003లో తొలిసారి ‘చంటిగాడు’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్‌, లవ్లీ.. తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2017లో విడుదలైన ‘వైశాఖం’ ఆమె దర్శకత్వంలో విడుదలైన చివరి చిత్రం.

కామ్న జెఠ్మలానీ, శాన్వి, సుహాసిని వంటి కథానాయికలను జ‌య తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశారు. ఆంగ్ల సాహిత్యం, సైకాలజీలో ‘ఎం.ఎ’ చేసిన జయ ప్రముఖ సినీ పాత్రికేయుడు, పీఆర్వో బీఏ రాజును వివాహం చేసుకున్నారు. ఆమె భర్త బి.ఎ. రాజుతో కలిసి పలు చిత్రాలనూ నిర్మించారు. జయ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.