ఢిల్లీకి చెంచాగిరి చేస్తున్న‌ది ఆయ‌నే..!

ప్ర‌గ‌తినివేద‌న స‌భ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు. ఢిల్లీకి గులాంగిరి చేద్దామా అంటూ ఆయ‌న మాట్లాడిన తీరుపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఓట్లకోసం కేసీఆర్ కొంగర కలాన్ లో కొంగ జపం చేశారని, కేసీఆర్ చేసిన ప్రగతిలేదు, సభలో నివేదన లేదని మాజీ మంత్రి పొన్నాల ల‌క్ష్మయ్య విమ‌ర్శించారు. విద్యుత్ గురించి గొప్పగా చెబుతున్న కేసీఆర్ ఒక్క మెగావాట్ విద్యుత్ నైన ఉత్పత్తి చేశారా, ఒక్క కొత్త ప్రాజెక్టునైన ప్రారంభించారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఢిల్లీ కి చెంచాగిరి చేస్తున్నది కేసీఆరేన‌ని, లేక‌పోతే ఆయ‌న ప‌దేప‌దే ఢిల్లీకి ఎందుకు వెళుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

కేసీఆర్ స‌భ అట్ట‌ర్ ప్లాప్ అయింద‌ని , రెండుల‌క్ష‌ల‌కు మించి జ‌నాలు రాలేద‌ని కాంగ్రెస్ నేత ష‌బ్బీర్ అలీ విమ‌ర్శించారు.
మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి టిఆర్ఎస్ హైప్ చేసినా ప్రజల నుంచి స్పందన కరువైందని, మూడెకరాల భూ పంపిణీ, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి ఎందుకు చెప్పలేదని ఆయ‌న అన్నారు. మైనార్టీ రిజర్వేషన్ పై ఢిల్లీలో భూ కంపం ఏమైందని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మ అధిష్టానం ఢిల్లీలోనే ఉంద‌ని, కానీ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోడీ కాళ్లు ఎందుకు మొక్కుతున్నార‌ని అన్నారు ష‌బ్బీర్ అలీ. స‌భ ఫెయిల్ అయింది కాబ‌ట్టి కేసీఆర్ ముంద‌స్తుకు వెళ్ల‌క‌పోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారాయ‌న‌.