జపాన్’లో చరణ్ హవా !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జపాన్ లో హవా చూపిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘మగధీర’. కాజల్‌ కథానాయిక. అల్లు అరవింద్‌ నిర్మాత. 2009లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డు సృష్టించింది. ఇటీవల ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేశారు. అక్కడ ‘మగధీర’డు హవా చూపిస్తున్నాడు. కేవలం 10రోజుల్లోనే రూ.17 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు.. సినిమాలోని గెటప్‌లు, ప్లకార్డులతో జపాన్ ప్రజలు సందడి చేస్తున్నారు. అవి సోషల్ మీడియాలోనూ వైరల్’గా మారాయి.

జపాన్ లో ‘మగధీర’ హవాపై చరణ్‌ ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించారు. ‘థాంక్యూ జపాన్‌.. మీరు మాపై కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. మీ అభిమానాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఇలాంటి చిరస్మరణీయమైన సినిమాను నాకిచ్చినందుకు ధన్యవాదాలు ఎస్‌.ఎస్‌. రాజమౌళి గారు. ఈ సినిమా విడుదలై పదేళ్లు అయ్యిందంటే నమ్మలేకపోతున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

ఇక, మగధీర తర్వాత మరోసారి రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత చరణ్, తారక్ లతో రాజమౌళి ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్ నుంచి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. 2020లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసుకొన్నారు.