చంద్రబాబుపై కుట్ర.. నిజమే !

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్రం కుట్ర చేస్తోంది. ఆయనకు త్వరలోనే ఓ జాతీయ స్థాయి రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి నోటీసులు అందనున్నాయని ప్రముఖ నటుడు శివాజీ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడవి నిజమేనని స్పష్టమైంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరో 14 మందికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గాను ఈ వారెంట్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చింది. ఈ నెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వితీయడం చర్చనీయాంశంగా మారింది.