రాజమౌళి బుర్రని తీసుకొన్నాడా ?

‘బాహుబలి 2’ తర్వాత దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్,‌ రామ్‌ చరణ్’లతో మల్టీస్టారర్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ‘#RRR’ పేరుతో (వర్కింగ్‌ టైటిల్‌) ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్ని ప్రారంభించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో తారక్‌, చెర్రీ అన్నాదమ్ములుగా కనిపించనున్నట్లు తెలిసింది.

ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. #RRR కోసం ప్రముఖ రచయిత సాయి మాధవ్‌ బుర్రా పనిచేయనున్నట్లు చెప్పుకొంటున్నారు. సాయి మాధవ్‌ ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘మహానటి’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు డైలాగ్స్‌ రాశారు. ప్రస్తుతం ఆయన ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఎన్టీఆర్‌’ సినిమాల కోసం పనిచేస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి ప్రాజెక్టుకు పనిచేయనున్నారని సమాచారం. ఐతే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక, ఈ సినిమా కోసం హీరోయిన్స్ గా సమంత, కీర్తి సురేష్, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరే కాకుండా ఓ బాలీవుడ్ హీరోయిన్ కోసం జక్కన్న ట్రై చేస్తున్నారనే టాక్ నడుతోంది. ఈ చిత్రాన్ని ఈ యేడాది నవంబర్ లోనే సెట్స్ మీదకు తీసుకెళ్లి.. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్టు సమాచారమ్.