‘నవాబ్’కు మహేష్ ప్రశంసలు

నవాబ్.. ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రం అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘చక్క చివంత వానం’. తెలుగులో ‘నవాబ్’గా తీసుకొచ్చారు. విజయ్ సేతుపతి, అరవింద్ సామి, జ్యోతిక, అదితీ రావు హైదరీ, ఐశ్వర్యా రాజేష్ ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు.

గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘నవాబ్’ హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. గతకొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయిన మణిరత్నం.. ఈ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చారు. నవాబ్ లో ఆయన మేజిక్ కనబడిందని చెబుతున్నారు. ఇప్పటికే తమిళ్’లో నవాబ్ రూ. 50కోట్ల క్లబ్’లో చేరిపోయాడు. తెలుగురాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ అదరగొడుతున్నాడు.

ఇప్పుడీ సినిమాపై మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. “‘నవాబ్‌’ అద్భుతమైన నటన. ఏఆర్‌ రెహమాన్‌కు మాత్రమే సాధ్యమైన మ్యూజిక్‌. సంతోష్‌ శివన్‌ క్లాస్‌ సినిమాటోగ్రఫి. మణిరత్నం అభిమానిగా చెన్నై థియేటర్లలో చప్పట్లు కొడుతూ ఆయన సినిమాలు చూశాను. ఇప్పుడు అదే పని నా హోం థియేటర్లో గర్వంగా చేశాను. ఇంకా మీరు సినిమా చూడనట్టైతే వెంటనే వెళ్లి టికెట్స్‌ తీసుకోండి. ఓ క్లాసిక్‌ చూసిన భావన కలుగుతుంది. ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రం. ద మాస్టర్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ పొగడ్తలతో ముంచేశారు మహేష్.