అఖిల్ సినిమాపై ఎన్టీఆర్ ఎఫెక్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ కి ఎదగాలన్నది అక్కినేని యంగ్ హీరో అఖిల్ కోరిక. నాగార్జున కోరిక కూడా. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందే అఖిల్ ని ఇండస్ట్రీ, ప్రేక్షకులు మహేష్ తో పోల్చుకున్నారు. అందంలో అఖిల్ మరో మహేష్ బాబు. ఆయన కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడని ఆకాంక్షించారు. ఐతే, అనుకున్నవన్నీ అయితే అది జీవితం ఎందుకు అవుతుంది. అఖిల్ విషయంలోనూ అదే జరిగింది.

తొలి చిత్రం ‘అఖిల్’ ప్లాప్. రెండో చిత్రం ‘హలో’ యావరేజ్. ఈ నేపథ్యంలో తన మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’పై అఖిల్ భారీ ఆశలు పెట్టుకొన్నాడు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాని వచ్చే యేడాది రిపబ్లిక్ డే (జనవరి 26) కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. ఐతే, ఈ చిత్రానికి ఎన్టీఆర్ చిత్రం అడ్డుగా వచ్చింది.

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితకథని రెండు భాగాలుగా తీసుకురానున్నారు. పార్ట్-1ని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’గా, పార్ట్ 2 ని ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా తీసుకొస్తున్నారు. తొలిభాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 25న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో అఖిల్ సినిమాపై ఎన్టీఆర్ ఎఫెక్ట్ పడింది. ఇక, అఖిల్ వెనకడుగు వేయక తప్పదేమో.. !