సింగర్ కూతురు సింగర్ అయ్యింది

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత కూతురు శ్రేయా కూడా సింగర్ అయ్యింది. ఆమెకు నాగచైతన్య ‘సవ్యసాచి’లో సంగీత దర్శకుడు కీరవాణి అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ కీరవాణి ట్విట్ చేశారు. ‘సునీత కుమార్తె శ్రేయా గోపరాజును ‘సవ్యసాచి’లోని డ్యుయెట్‌తో గాయనిగా పరిచయం చేస్తున్నా. ఆమెది తన తల్లిలాంటి స్వరం కాదు.. పూర్తిగా పాశ్చాత్య ఫీల్‌ కలిగింది’ అని తెలిపారు.
కీరవాణి ట్విట్ పై సునీత స్పందించారు. ‘ధన్యవాదాలు కీరవాణి గారు.. అవును నా కుమార్తె నేపథ్య గాయనిగా ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘సవ్యసాచి’తో పరిచయం కాబోతోంది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నా. త్వరలో ఈ పాట విడుదల కాబోతోంది. గర్వంగా ఉంది. తొలి రికార్డింగ్‌ సెషన్‌లో శ్రేయా చాలా భయపడింది. కీరవాణిగారు చాలా సేపు మాట్లాడి, ధైర్యం చెప్పారు. ఇది చూశాక ఆయనతో నా తొలి రికార్డింగ్‌ గుర్తొచ్చింది’ తన ఫేస్ బుక్ ఖాతాలో రాసుకొచ్చింది.
ఇక, ‘సవ్యసాచి’ చందూ మొండేటి దర్శకత్వం వహించారు. నాగ చైతన్యకి జంట నిధి అగర్వాల్ జతకట్టనుంది. భూమిక, మాధవన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.