కోహ్లీ, రోహిత్.. శతకొట్టారు !

టెస్టుల్లో వెస్టిండీస్‌ ని పసికూనని చేసి ఆడుకొంది కోహ్లీ సేన. రెండు టెస్టుల్లోనూ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు వన్డేల్లోనూ అదే పరిస్థితి. ఆదివారం జరిగిన తొలి వన్డేలో వెండీస్ పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ షిమ్రాన్‌ హెట్‌మయర్‌ (106; 78 బంతుల్లో 6×4, 6×6) మెరుపు సెంచరీ సాధించాడు. భారీలక్ష్యంతో బరిలోకి దిగినా భారత్‌ ఏమాత్రం ఇబ్బంది పడలేదు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (140; 107 బంతుల్లో 21×4, 2×6), ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (152 నాటౌట్‌; 117 బంతుల్లో 15×4, 8×6) విండీస్‌ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ శతకాలు చేశారు. దీంతో.. మరో 47 బంతులుండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి
లక్ష్యాన్ని ఛేదించింది. వన్డేల్లో కోహ్లీకిది 36వ శతకం కావడం విశేషం. సచిన్‌ 49 శతకాల తర్వాతి స్థానం విరాట్‌దే.