అక్కకు ప్రేమతో.. కళ్యాణ్, తారక్ !

అక్క కోసం నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్, జూ. ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తెలంగాణ టీడీపీ అభ్యర్థిగా స్వర్గీయ నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్క కోసం కళ్యాణ్ రామ్, తారక్ లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా, అక్క పోటీపై నందమూరి బ్రదర్స్ స్పందించారు.

అక్క గెలుపుని ఆకాంక్షిస్తూ ఓ ప్రెస్ నోటుని విడుదల చేశారు. ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో మా తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారు. తెదేపా మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్న హరికృష్ణ తెదేపాకు ఎనలేని సేవలందించారు. మా సోదరి సుహాసిని కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. సమాజంలో స్త్రీలు ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం మాది. అదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధపడుతోన్న మా సోదరికి విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నాం. జై ఎన్టీఆర్‌. జోహార్‌ హరికృష్ణ’ అని నోటులో పేర్కొన్నారు.

సుహాసిని గెలుపు బాధ్యతని స్వయంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆమె బాబాయ్ బాలకృష్ణ తీసుకొంటామని హామీ ఇచ్చారని తెలిసింది. దీనికితోడు కళ్యాణ్ రామ్, జూ. ఎన్ టీఆర్ లు ప్రచారంలో పాల్గొంటే సుహాసిని పని మరింత ఈజీ అవ్వనుంది. కూకట్ పల్లి నియోజకవర్గంలో సెటిలర్స్ ఎక్కువగా ఉండటం.. మహాకూటమిలో భాగంగా టీడీపీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకు కలవనుండటంతో సుహాసిని గెలుపు నల్లేరు మీద నడకనే చెబుతున్నారు రాజకీ విశ్లేషకులు.