రాజమౌళి పెళ్లి ప్లాన్ అదిరింది !

దర్శకధీరుడు రాజమౌళి ఏ పని చేసినా పక్కా ప్లానింగ్ తో చేస్తారని చెబుతుంటారు. ఆయన తనయుడు కార్తికేయ వివాహం వేడుక విషయంలోనూ జక్కన్న ప్లాన్ అదిరిందని చెప్పుకొంటున్నారు. రాజస్థాన్‌ రాజధాని జయపుర‌లోని ఓ ప్యాలెస్‌లో కార్తికేయ వివాహ వేడుకను నిర్వహించారు. ఆదివారం రాత్రి వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

వేడుకకు రెండు రోజుల ముందే టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్‌, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా, నాని తదితరులు జయపురకు చేరుకొన్నారు. వీరిని రాజమౌళి ప్రత్యేకంగా రిసీవ్ చేసుకొన్నారు. సంగీత వాయిద్యాలు.. డబ్బుల దరువుతో డ్యాన్స్ చేస్తూ ఆహ్వానం పలికారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వీటితో పాటు తారక్, చరణ్, ప్రభాస్ లతో రాజమౌళి చేసిన రచ్చ హైలైట్ గా నిలిచింది. ఇక పెళ్లిలో ప్రభాస్-అనుష్కల జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు బయటికొచ్చాయి. మొత్తంగా.. కార్తికేయ వివాహ వేడుక సరదా వాతావరణంలో చాలా సంతోష వాతావరణంలో జరిగింది. ఇంత సక్సెస్ కావడానికి జక్కన్న వేసిన ప్లాన్ కారణం అంటున్నారు.

కార్తికేయ పెళ్లి వేడుకకి రాజమౌళి చాలా తక్కువ మందిని ఆహ్వానించారు. ఇండస్ట్రీలోనూ తమ కుటుంబ సభ్యులుగా భావించేవారిని మాత్రమే ఆహ్వానించారు. మొత్తంగా ఓ 30మంది వరకు ఆహ్వానాలు అందినట్టు తెలిసింది. రాజకీయ ప్రముఖులని మొత్తానికే పక్కన పడేశారు రాజమౌళి. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకలో సీరియస్ నెస్ కనిపించలేదు. అక్కడి వచ్చిన వారంతా రాజమౌళి కుటుంబంలో సభ్యులుగానే పెళ్లి వేడుకని ఆస్వాదించి.. ఆనందించారు. ఇక, త్వరలోనే సినీ, రాజకీయ ప్రముఖులకి హైదరాబాద్ లో గ్రాండ్ గా పెళ్లి పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు జక్కన్న.