తెరాసలో చేరిన వంటేరు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు పోటీ చేశారు. 2014, 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఐతే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానం మేరకు వంటేరు తెరాసలో చేరేందుకు నిర్ణయం తీసుకొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. ప్రతాప్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ తనను రెండుసార్లు తెరాసలోకి ఆహ్వానించినా తాను వెళ్లలేదు. ఈసారి మాత్రం గట్టిగా అడిగేసరికి ఆ మాటకు కట్టుబడి తాను ఈరోజు తెరాసలో చేరినట్టు చెప్పారు.
కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు సరైనవని ప్రజలు తీర్పు ఇచ్చారని, అందువల్ల ఆయన నిర్ణయాలే కరెక్టు అని తాను గ్రహించినట్టు చెప్పారు. అందుకే సీఎం నిర్ణయానికి కట్టుబడి తాను తెరాసలో చేరినట్టు వంటేరు స్పష్టంచేశారు.