కెసిఆర్ చండీయాగం పరిసమాప్తం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన చండీయాగం సమాప్తమైంది. గత ఐదురోజులుగా జరిగిన ఈ యాగంలో విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతీ మంటపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రాజశ్యామల మంటపం, బగలాముఖి మంటపం, నవగ్రహ, ఋగ్వేద, యజుర్వేద, సామవేద అధర్వణ వేద మంటపాలలో తొలుత పూర్ణాహుతి జరిగింది.

ఆ తర్వాత ప్రధాన యాగశాల అయిన చండీమాత మహా మంటపంలో పూర్ణాహుతి ప్రారంభం అయింది. ఉదయం 11 గంటల నుంచి అన్ని యాగాల పూర్ణాహుతులు జరిపి, సహస్ర చండీ మహా యాగ పూర్ణాహుతిని అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, విశాఖ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యక్షంగా పాల్గొని అనుగ్రహించారు. కార్యక్రమానంతరం సీఎం కేసీఆర్ ఋత్వికులను ఘనంగా సన్మానించారు.