పాక్‌’కు అమెరికా హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికా మరోసారి పాకిస్థాన్ ను తీవ్రంగా హెచ్చరించింది. ఇప్పటికైనా ఉగ్రవాదంపై పాకిస్థాన్ గట్టి చర్యలు తీసుకోవాలని యూఎస్‌ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఓ ప్రకటనలో తెలిపారు. సరిహద్దు వెంట నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. తొందరపాటు చర్యలకు పాల్పడొద్దు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మైక్‌ పాంపియో తన ప్రకటనలో తెలిపారు.

గతవారం అజిత్‌ డోభాల్‌తో మాట్లాడిన అమెరికా భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్.. ఆత్మ రక్షణ చర్యల్లో భాగంగా భారత్‌ తీసుకోబోయే ఎటువంటి చర్యలకైనా అమెరికా మద్దతిస్తుందని తెలిపిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి తరవాత ప్రతీకారంతో రగిలిపోయిన భారత్‌ మంగళవారం తెల్లవారుజామున జైషే ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. మరిన్ని దాడులకు పాల్పడబోతుందన్న సమాచారం ఉండడంతోనే ముందస్తుగా దాడులు చేయాల్సి వచ్చిందని భారత్‌ ప్రకటించింది.