యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం


యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది.మంగళవారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు మధ్యలో ఉన్న వంట చేసే బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు రావటంతో పక్కబోగీలో ఉన్న ప్రయాణికులు చైన్‌ లాగి రైల్‌ను నిలిపివేశారు.

వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు రెండు బోగీలను తప్పించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ప్రమాదంలో వంట చేసే బోగీ పూర్తిగా కాలిపోయింది. దీని పక్కన ఉన్న బోగీ కూడా పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో రైల్వే సిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు.