రకుల్ ఏమాత్రం.. పెంచలేదట !

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అత్యంత వేగంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. కెరీర్ మొదట్లో వరుసగా యంగ్ హీరోలతో జతకట్టిన రకుల్.. ఆ తర్వాత మాత్రం వరుసగా స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఐతే, ఇప్పుడు రకుల్ జోరు కాస్త తగ్గింది. మునుపటిలా బిజీగా లేదు. ఇందుకు రకుల్ భారీగా రెమ్యూనరేషన్ పెంచడం ఓ కారణమనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా, ఈ ప్రచారంపై రకుల్ స్పందించింది. “తాను పారితోషికం పెంచానంటూ వస్తున్న పుకార్లలో ఏమాత్రం నిజం లేదు. అవన్నీ కట్టుకథలు. ఎన్ని కట్టుకథలు ప్రచారం చేసినా నా ఎదుగుదలని ఎవరూ అడ్డుకోలేరు. ఇలాంటి పుకార్లని నేను పట్టించుకోను. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా బిజీగా ఉన్న కొద్దిమంది హీరోయిన్లలో తాను ఒకరిని” అని రకుల్ చెప్పింది.

ప్రస్తుతం తెలుగులో రకుల్ చేతిలో సినిమాలేవీ. నాగ్ ‘మన్మథుడు2’ సినిమా కోసం రకుల్ ని తీసుకొన్నారనే ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ లో సూర్య సరసన ‘ఎన్‌జికె’, శివకార్తికేయన్ సరసన మరో చిత్రంలో నటిస్తోంది రకుల్. ఈ రెండు చిత్రాలపై రకుల్ భారీ ఆశలు పెట్టుకొంది. బాలీవుడ్ లో కూడా రెండు చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు, బయట బిజినెస్ లు చేస్తోంది.