తెలంగాణ బీజేపీ మళ్లీ అదే మాట.. !

తెలంగాణ బీజేపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఒకే మాట చెబుతూ ఉంటుంది. అదే.. అధికారంలోకి ఉన్న పార్టీకి అసలైన ప్రత్యామ్నాయం తామేనని. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అదే చెప్పింది. ఇప్పుడు తెరాస అధికారంలో ఉన్నప్పుడూ.. అదే చెబుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ ఐటీఐ కళాశాల మైదానంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆయన తెరాస, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పించారు.

ఇదే సభలో మాట్లాడిన తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలంగాణలో తెరాసకు అసలైన ప్రత్యామ్నాయం భాజపానే అన్నారు. భాజపాను గెలిపించి పాలమూరు ప్రజలు చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు. భాజపా గెలిస్తేనే కేసీఆర్‌ ప్రగతి భవన్‌ వదిలి సచివాలయానికి వస్తారని వ్యాఖ్యానించారు. లక్ష్మణ్ చెబుతోంది నిజం అయ్యేలా ఉంది. ఎందుకంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. మిగిలిన నలుగురైదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కారెక్కెస్తే.. భాజాపా కల నెరవేరినట్టే.. !