కారు స్టీరింగ్ మజ్లిస్‌ చేతుల్లో.. !

మొన్న తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. కేసీఆర్ జ్యోతిష్యాల సెంటిమెంట్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని ఓ జ్యోతిష్యుడు చేతిలో పెడతారా? అంటూ ప్రశ్నించారు. తాజాగా, మరోసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో మోదీ ప్రసంగించారు.

ఈసారి తెరాసతో పాటు దాని దోస్తానా పార్టీ మజ్లిస్ పై విమర్శలు చేశారు. కారు తెరాసదే అయినా.. స్టీరింగ్‌ మాత్రం మజ్లిస్‌ చేతుల్లోనే ఉందని ఆరోపించారు. ప్రజల అభివృద్ధి గురించి మజ్లిస్‌ పట్టించుకోదని, పాతబస్తీలో మెట్రో లైను వేస్తామంటే వారు అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. మజ్లిస్‌తో సావాసం వల్ల తెరాస కూడా పాతబస్తీ ప్రజల్ని పట్టించుకోవడంలేదన్నారు. మూసీకి ఒకవైపు మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని మండిపడ్డారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇప్పటి చౌకీదార్‌ ప్రభుత్వం మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు